ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రేపు జరగబోయే ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూటమి నేతలకు పిలుపునిచ్చారు. మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లాల కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో టెలికాన్ఫరెన్స్ (Teleconference)లో మాట్లాడిన సీఎం, డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ తరాల పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. రేపు కర్నూలులో జరిగే “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” (Super GST-Super Savings) సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారని తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఒక్కో కుటుంబానికి రూ.15 వేల వరకు ఆదా అవుతుందని చంద్రబాబు వివరించారు. “రాయలసీమలో పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. సీమ జిల్లాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి తిరుపతి, శ్రీశైలం, గండికోట వంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. రాయలసీమ టూరిజం డెస్టినేషన్గా మారబోతోంది” అని ఆయన అన్నారు.
“హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధన లక్ష్యంగా మనం అంతా కృషి చేయాలి. రేపు ప్రధాని రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీశైలం, కర్నూలు పర్యటనలతో రాష్ట్రానికి కొత్త దశ ప్రారంభమవుతోంది. తిరుమల తర్వాత జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్న క్షేత్రంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం” అని సీఎం స్పష్టం చేశారు.







