కలెక్టర్ల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు. ముఖ్యంగా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక విధానంలో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవడం తథ్యం అని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇసుక విధానాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో రాజకీయం చేరకుండా ఉండాలన్నారు.
వారికే మద్దతు..
డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని, మంచి చేసేవారికి ప్రభుత్వ సపోర్టు ఉంటుందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. ఇసుక దోపిడీ విషయంలో రాజకీయం అనేది సహించరానిదన్నారు. ఎవరైనా ఇసుక విధానంలో జోక్యం చేసుకుంటే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని, అందులో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పని చేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులకు సూచించారు.
ఇసుక ఉచితమే, కానీ..
ఉచిత ఇసుక విధానమని ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని నిలబెట్టుకోలేకపోయిందనే విమర్శలున్నాయి. ఇసుక ఉచితమైనా ర్యాంపుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా అధికార పార్టీలకు చెందిన నేతలు ఇసుకను విచ్చలవిడిగా తవ్వుకుంటూ యథేశ్చగా దందా సాగిస్తున్నారని, అధికారుల అండతో వేలల్లో దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుకపై తాజాగా డిప్యూటీ సీఎం వ్యాఖ్యల్లో ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.