పిడిఎస్ రైస్ (PDS Rice) అక్రమార్కులు, సహకరిస్తున్న సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులపై నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ (Nellore urban Development Authority Chairman) కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి (Kotamreddy Srinivasulu Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ (Ruling Party)కి చెందిన వారే రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్టు స్పష్టమయినట్లుగా తెలిసిందని, దీనిపై తగిన చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తుందని అన్నారు. పేదలకు అందాల్సిన బియ్యం కొందరు అక్రమార్కులు స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ, అధికారులు పట్టించుకోడం లేదని చైర్మన్ అన్నారు.
ఇటీవల నెల్లూరు సుభాని నగర్ (Subhani Nagar)లో ఐదు లారీలను అధికారులు కావాలనే వదిలివేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదు లారీలలో రెండు లారీలలో మాత్రమే PDS రైస్ ఉందని తప్పుడు రిపోర్టులు అధికారులు జేసీకి అందించారని, సివిల్ సప్లై అధికారులు కూడా తమ విధులను తప్పుదారి పట్టించి, తమ జేబులు నింపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కోవూరు, నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో, అలాగే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో PDS రైస్ను ఒక స్మగ్లర్ పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేస్తున్నారని చైర్మన్ వెల్లడించారు.
“ఇలాంటి అక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. స్థానిక ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నా కూడా PDS దందా ఆగడం లేదు. రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, రీ-సైక్లింగ్ చేసి, చెన్నైకి పంపిస్తున్నారు. నెల్లూరు, కొడవలూరు, బెస్తవారిపేటలో ఉన్న రైస్ మిల్లు పేరుతో PDS రైస్ రవాణా జరుగుతోంది. ఈ స్మగ్లర్పై పీడీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.








