‘కాంతార చాప్టర్ 1’ చిత్రం విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు మరియు భారీ వసూళ్లు సాధిస్తున్న విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ఈ ప్రీక్వెల్పై ఇప్పటికే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా, యష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు స్పందించి ప్రశంసలు కురిపించారు. తాజాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కూడా తనదైన శైలిలో రివ్యూ ఇచ్చి, రిషబ్ శెట్టిపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆర్జీవీ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “కాంతార ఛాప్టర్ 1 అద్భుతం. రిషబ్ శెట్టి, అతని టీమ్ బీజీఎం, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, వీఎఫ్ఎక్స్లో చూపించిన అద్భుతమైన ప్రయత్నం చూసిన తర్వాత.. భారతదేశంలో దర్శకులందరూ సిగ్గుపడాలి” అని వర్మ తీవ్ర వ్యాఖ్య చేశారు.
అంతేకాకుండా, “కంటెంట్ ఒక బోనస్ మాత్రమే. కేవలం వారి కష్టానికే ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలవడానికి అర్హత ఉంది. హోంబలే ఫిల్మ్స్ క్రియేటివ్ టీమ్కు ఇచ్చిన స్వేచ్ఛకు హ్యాట్సాఫ్. రిషబ్ శెట్టి, మీరు గొప్ప దర్శకులా లేక గొప్ప నటులా అనే విషయంలో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను” అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.
రిషబ్ శెట్టి స్పందన
తన పనికి లభించిన ఈ ప్రశంసలకు రిషబ్ శెట్టి వినయంగా స్పందించారు. “నేను కేవలం సినిమా లవర్ మాత్రమే సార్. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అని ఆర్జీవీకి రిప్లై ఇచ్చారు.
‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో విడుదలైంది. 2022లో వచ్చిన ‘కాంతార’ కథకు వెయ్యి సంవత్సరాల ముందు రోజుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.







