నేపాల్లో చెలరేగిన అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నేపాల్ పర్యటనకు వెళ్లిన 81 మంది ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అక్కడి అల్లర్లలో చిక్కుకున్నారు. యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 3న విహారయాత్ర కోసం బయలుదేరిన ఈ బృందంలో 70 మంది విశాఖవాసులు, మిగతా 11 మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందినవారు ఉన్నారు. ప్రస్తుతం వారు ఖాట్మండులోని రాయల్ కుసుమ్ హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
గత రెండు రోజులుగా నేపాల్ రాజధాని ఖాట్మండులో కర్ఫ్యూ కొనసాగుతుండడంతో, యాత్రికులు ఎటు కదలలేని స్థితిలో చిక్కుకుపోయారు. బయట పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో వారు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నట్లు సమాచారం. తమ పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, సురక్షితంగా స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకోవాలని యాత్రికుల బృందం ఆవేదన వ్యక్తం చేసింది. అయితే వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా సమాచారం.