సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వార్నింగ్

సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వార్నింగ్

పొగాకు రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు పొదిలిలో ప‌ర్య‌టించిన మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూటమి ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, కూటమి ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో విఫలమైందని తీవ్ర విమర్శలు గుప్పించారు. పొదిలిలోని పొగాకు బోర్డును సందర్శించిన ఆయన, రైతులకు కనీస మద్దతు ధర (కేజీకి రూ.280) అందించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే స్థితికి చేరుకున్నారని, ప్రకాశం జిల్లాలోని పరుచూరు, కొండెపిలో ఇటీవల ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి వల్ల వ్యవసాయం దండగ అనే భావన కొనసాగుతోందని ఆరోపించారు.

వైఎస్ జగన్ తన ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. తమ హయాంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు వెన్నెముకగా నిలిచామని, పొగాకు, మిర్చి, పత్తి వంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించామని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్‌లో పోటీ పెంచామని తెలిపారు. వైసీపీ హయాంలో పొగాకు క్వింటాకు రూ.24 వేలు, కేజీకి రూ.366 వచ్చేదని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రూ.240 కూడా రావడం లేదని విమర్శించారు. ఉచిత బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలను కూటమి ప్రభుత్వం ఎత్తేసిందని, కల్తీ ఎరువులు, విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించకుండా, దళారులతో ఒప్పందాలు చేసుకుని రైతులను నష్టపరుస్తున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపమని జగన్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా సాయం రూ.20 వేలు ఎగ్గొట్టారని, రైతులకు హామీ ఇచ్చిన ఆర్థిక సహాయం అందడం లేదని ఆరోపించారు. పొగాకు రైతులు ఎకరానికి రూ.80 వేలు నష్టపోతున్నారని, హైగ్రేడ్ పొగాకుకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్‌ను వేలంలో పాల్గొనేలా చేసి మార్కెట్‌లో పోటీ పెంచాలని, తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, ప్రజల గుండెల్లో చోటు ఉన్న వైసీపీ రైతుల పక్షాన నిలబడుతుందని జగన్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment