సీనియర్ జర్నలిస్ట్, సాక్షి మీడియా ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు (కెఎస్ఆర్)ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదుల మేరకు ఆయనపై కేసు నమోదైంది. సాక్షి టీవీలో జరిగిన ఓ చర్చలో ప్యానల్ సభ్యుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు, రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఆరోపణలపై ఈ కేసు నమోదైనట్లుగా సమాచారం. అయితే, ఈ వ్యాఖ్యలను సాక్షి టీవీ ఖండించింది. ప్యానల్ సభ్యుడు మాట్లాడిన మాటలకు తనకు సంబంధం లేకపోయినా క్షమాపణలు చెప్పానని కొమ్మినేని వెల్లడించారు.
అరెస్ట్పై స్పందించిన కొమ్మినేని..
కొమ్మినేని శ్రీనివాసరావు తన అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ, ఈ చర్య ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ను అణచివేసే యత్నంగా అభివర్ణించారు. “70 ఏళ్ల వయస్సులో నన్ను వేధిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నా వరకు వచ్చింది. కేసు ఎవరు పెట్టారో, ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదు. సీనియర్ జర్నలిస్ట్కే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు. సాక్షి టీవీలో తన డిబేట్లు రాకుండా చేయడానికి ఈ కేసు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఆయన ఇంటికి ఏపీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. చర్చలో ప్యానలిస్ట్గా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యుడని కాదని వాదించారు.
వైసీపీ నాయకులు ఈ అరెస్ట్ను రాజకీయ కక్షసాధింపు చర్యగా ఖండించారు. “ప్రభుత్వ విమర్శలను అణచివేయడానికి జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం,” అని వైసీపీ నాయకుడు ఒకరు అన్నారు. కొమ్మినేని గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, టీవీ5 వంటి సంస్థల్లో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్గా, సాక్షి టీవీలో ‘కెఎస్ఆర్ లైవ్ షో’ ద్వారా ప్రముఖంగా ఉన్నారు. ఈ అరెస్ట్ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై తీవ్ర చర్చను రేకెత్తించింది. జర్నలిస్టుల సంఘాలు, పౌర సమాజం ఈ చర్యను ఖండిస్తున్నాయి.