ప్రపంచంలోనే అత్యంత సుప్రసిద్ధ హిందూ దేవాలయమైన తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం (Sri Venkateswara Swamy Temple)పై మరోసారి విమానం (Aircraft) చక్కర్లు కొట్టింది. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఒక విమానం అతి తక్కువ ఎత్తులో చక్కర్లు కొట్టడం భక్తులలో (Devotees) ఆందోళన కలిగించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) భద్రతా అధికారులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.
వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం, శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడటానికి ఆలయం పై భాగంలో ఎలాంటి విమానాలు, హెలికాప్టర్లు లేదా డ్రోన్లు రాకపోకలు సాగించకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. దేవతలు, గంధర్వులు, ఇతర దివ్య శక్తులు ఆలయం పై నుండి శ్రీవారి అరూప దర్శనం చేసుకుంటున్నాయని నమ్మే ఆధ్యాత్మిక విశ్వాసం. అయినప్పటికీ, ఇటీవల శ్రీవారి ఆలయం పై విమానాల రాకపోకలు భక్తులను కలవరపరుస్తున్నాయి.
టీటీడీ గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ (Ministry of Civil Aviation)కు తిరుమలను నో-ఫ్లై జోన్ (No-Fly Zone)గా ప్రకటించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు. అందుకు తాజా సంఘటన ఉదాహరణగా మారింది. అందులోనూ పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ ఉండడం గమనార్హం.
టీటీడీ భద్రతా విభాగం ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. విమానం రాకపోకల ఉద్దేశ్యాన్ని గుర్తించేందుకు చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఘటన భక్తుల మనోభావాలను గాయపరిచిందని, ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు భద్రతను హామీ చేసేందుకు తిరుమలను నో-ఫ్లై జోన్గా ప్రకటించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తిరుమల భద్రతపై కేంద్ర ప్రత్యేక దృష్టిసారించింది. అలాగే తిరుమల ఆలయం భద్రత మరియు పవిత్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.








