బాధ్యత గల బ్యూరోక్రాట్ చేసిన పని తెలంగాణ (Telangana) లో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాళ్లు మొక్కిన ఐఏఎస్ (IAS) అధికారి ఏ. శరత్ (A. Sharath) ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) (CS) కె. రామకృష్ణారావు (K. Ramakrishna Rao) ఆల్ ఇండియా సర్వీసెస్ (ఏఐఎస్) (AIS) అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన సర్వీస్ హోదాకు తగనిదని, ఇలాంటి చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం నాగర్కర్నూల్ (Nagar Kurnool) జిల్లా మాచారం గ్రామంలో జరిగిన ఇందిర సౌర గిరి జల వికాసం పథకం (Indira Saur Giri Jal Vikasa Scheme) ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ. శరత్, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడమే కాకుండా, ఆయన కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది, దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం రేవంత్ రెడ్డి గిరిజన ఐఏఎస్ అధికారితో కాళ్లు మొక్కించుకున్నారని ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ఈ చర్యను ఖండిస్తూ పలువురు ట్వీట్ చేశారు. అధికారులు హోదాకు తగినట్లు వ్యవహరించాలని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
సీఎస్ హెచ్చరికలు
సీఎస్ కె. రామకృష్ణారావు తన ఉత్తర్వుల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ (ఏఐఎస్) నియమావళి 1968లోని రూల్ 3(1)ని ఉటంకిస్తూ, అధికారులు తమ విధుల్లో సంపూర్ణ అంకితభావం కలిగి ఉండాలని, సర్వీస్ హోదాకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. ప్రజా సమావేశాల్లో ఇలాంటి అనుచిత ప్రవర్తన సర్వీస్ గౌరవాన్ని దెబ్బతీస్తుందని, అధికారుల పట్ల ప్రజల విశ్వాసాన్ని కుంటుపడతాయని ఆయన హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఘాటుగా తెలిపారు.