విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) బాలీవుడ్ (Bollywood) ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాజకీయాలను ఉద్దేశించి మాట్లాడారు. రాజకీయాలపై బాలీవుడ్ సెలబ్రిటీలు (Bollywood Celebrities) స్పందించకపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ “బాలీవుడ్లో ఉన్న సగం మంది ఇప్పటికే అమ్ముడుపోయారు (Sold Out). అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడరు. మిగిలినవాళ్లకు మాట్లాడే ధైర్యం లేదు. నేరాలు చేసిన వారినైనా చరిత్ర వదిలేస్తుందేమో కానీ, మౌనంగా కూర్చున్నవారిని మాత్రం విడిచిపెట్టదు. ప్రతిఒక్కరూ బాధ్యత వహించాల్సిందే” అని అన్నారు.
తన వ్యాఖ్యలతో దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితుల పట్ల తన నిరాశను వ్యక్తం చేసిన ఆయన, సినీ ప్రముఖులు సామాజిక అంశాలపై మాట్లాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ ముక్కుసూటిగా స్పందించే వ్యక్తిగా, సమాజంలోని అంశాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా పంచుకునే నటుడిగా పబ్లిక్లో టాక్ నడుస్తోంది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో గందరగోళాన్ని రేపే అవకాశముందంటున్నారు రాజకీయ ప్రముఖులు.