లోన్యాప్ పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను విశాఖ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం చేపట్టిన విచారణలో సంచలన విషయాలు బయటపడినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా ఏకంగా 200 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్న ఈ లోన్ యాప్ ద్వారా ఆర్థిక నేరాలకి పాల్పడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లోన్ యాప్లో 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిపై లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు దిగారు. తన భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి బంధువులుకు పంపిస్తూ సైబర్ నేరగాళ్లు తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, లోన్ యాప్ నిర్వాహకుల టార్చర్ భరించలేక అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు లోన్యాప్ ముఠాను అరెస్టు చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించారు. వీరి నుంచి 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్ము లు, 60 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.