నంద్యాల జిల్లా(Nandyal District)లోని శ్రీశైలం(Srisailam) సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. నల్లమల (Nallamala) ఘాట్ రోడ్డులో మలుపు వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో పది మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే, శ్రీశైలంలోని మల్లన్న దర్శనానికి ప్రయాణికులతో బస్సు బయల్దేరింది. నల్లమల ఘాట్ రోడ్డులో ‘చిన్నారుట్ల దెయ్యాల మలుపు’ వద్ద ప్రమాదానికి గురైంది. మలుపు వద్ద డ్రైవర్కు అదుపు తప్పడంతో బస్సు నేరుగా కొండను ఢీకొట్టినట్టు తెలుస్తోంది.
గాయపడినవారికి చికిత్స
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సులో ఎన్ని మంది ప్రయాణికులు ఉన్నారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్(Driver)తో పాటు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.







