జమ్మూకశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) ప్రాంతంలో జరిగిన భయానక ఉగ్రదాడికి సంబంధించి ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విడుదల చేసింది. మంగళవారం టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 30 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. ప్రత్యక్ష సాక్షుల ఇచ్చిన వివరాల ఆధారంగా, నిపుణుల సహకారంతో ఉగ్రవాదుల స్కెచ్ రూపొందించిన NIA.. వాటిని మీడియాకు విడుదల చేసింది.
దేశాన్ని కుదిపేసిన ఉగ్రవాద చర్యపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ప్రస్తుతం భారత సైన్యం (Indian Army) ఈ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఈ ముగ్గురు దాడికి పాల్పడిన వారేనని అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులను గుర్తించడంలో ప్రజలు సహకరించాలని ఎన్ఐఏ విజ్ఞప్తి చేసింది. విడుదల చేసిన స్కెచ్లో ఉన్న వ్యక్తుల గురించి సమాచారం ఉంటే, వెంటనే దర్యాప్తు సంస్థకు తెలియజేయాలని కోరారు.