విశాఖపట్నం (Visakhapatnam) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) నుంచి మరోసారి విమాన ప్రయాణికులకు నిరాశ ఎదురైంది. వచ్చే నెల నుంచి వైజాగ్ (Vizag) నుండి బ్యాంకాక్ (Bangkok), కౌలాలంపూర్ (Kuala Lumpur) కు వెళ్లే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుకానున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా ఎయిర్లైన్స్ (Airlines) తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే విజయవాడకు నడిచే రెండు విమాన సర్వీసులు, దుబాయ్ విమాన సర్వీసు కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో పరిశ్రమల అభివృద్ధికి బ్రేక్ పడుతోందని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొని, రద్దైన సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ను కోరుతున్నారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఈ విషయంలో వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.