మేడ్చల్ జిల్లాలో ఒక భయంకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు సైకోలా మారి విచక్షణారహితంగా ప్రజలపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్కు చెందిన జగేశ్వర్ తన భార్య, 6 ఏళ్ల కుమార్తె రియా కుమారితో కలిసి పోచారం మునిసిపాలిటీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇదే ప్రాంతంలో పశ్చిమ బెంగాల్కు చెందిన హప్నహెమ్ బ్రూమ్ (30) అనే యువకుడు ఇదే ప్రాంతంలో ఉంటూ రోజువారి కూలిగా పనిచేస్తుంటాడు.
అయితే, శుక్రవారం హప్న అకస్మాత్తుగా సైకోలా మారి, లేబర్ క్యాంప్లో ఆడుకుంటున్న చిన్నారి రియా కుమారి తలపై బీరు సీసాతో కొట్టి పరుగు తీశాడు. చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తీవ్ర గాయాలతో రియాకుమారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. అక్కడితో ఆగకుండా, హప్న జోడిమెట్ల వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వెళ్లి వాహనాలపై రాళ్లు విసిరాడు. ఈ దాడిలో రెండు కార్ల అద్దాలు, ఒక ఆటో ధ్వంసం కాగా, పలువురు గాయపడ్డారు. ఈ భయానక ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
సైకో వీరంగానికి ముగింపు
దాడికి పాల్పడుతున్న హప్నను స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.