తెలుగు సినీ పరిశ్రమను మరోసారి బెట్టింగ్ యాప్ ల వివాదం కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదవగా, తాజాగా నందమూరి బాలకృష్ణ పేరు ఈ వివాదంలో తెరపైకి రావడం కలకలం రేపుతోంది. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్ ప్రచారం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఓ వ్యక్తి బాలయ్య షోలో వచ్చిన యాప్ ద్వారా రూ.88 లక్షలు కోల్పోయానని ఆరోపించగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ప్రభాస్ గెస్ట్గా వచ్చిన ఎపిసోడ్లో “Fun88” బెట్టింగ్ యాప్ ప్రచారం జరిగిందని ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ వ్యవహారం టాలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఇది బాలకృష్ణకు, అల్లు ఫ్యామిలీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతుందా? లేక న్యాయపరంగా బయటపడతారా? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో వచ్చే ప్రకటన చూసి నేను బెట్టింగ్ పెట్టడం మొదలు పెట్టాను..
— RTV (@RTVnewsnetwork) March 21, 2025
డబ్బులు వస్తాయ్ అనే ఆశతో ఆడటం మొదలు పెట్టాను.
మొదట్లో 3 లక్షల వరకు వచ్చాయి.. ఆ తర్వాత వాళ్ల ఊబిలోకి లాగుతారు.
నేను అలా రూ.80 లక్షలు నష్టపోయి ఆత్మహత్యాయత్నం కూడా చేశాను
– బెట్టింగ్ బాధితుడు… pic.twitter.com/qH5Qi8E3Se
అన్స్టాపబుల్ షో ప్రసారం చేసే ఆహా ఓటీటీ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ యాజమాన్యంలోని సంస్థకు చెందినదే కావడంతో, ఈ కేసులో అల్లు ఫ్యామిలీకి కూడా ఎదురుదెబ్బ తగలనుందా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులు పలువురిని ఇరుకున పెట్టగా, తాజాగా ఈ వివాదం మరింత దారుణంగా మారే సూచనలున్నాయి. ఈ కేసు చట్టపరంగా ఎటువంటి మలుపులు తిరుగుతుందో అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ లాంటి ప్రముఖులు బెట్టింగ్ యాప్ కేసుల్లో న్యాయపరమైన వివరణలు ఇచ్చారు. తెలంగాణలో 2017 నుంచి బెట్టింగ్ యాప్ లపై బ్యాన్ ఉండగా, తాజాగా ఈ కేసులు మళ్లీ తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.