గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఏడాదికి పైగా సాగిన ఈ యుద్ధంలో జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. అయితే, ఒప్పంద గడువు ముగియడంతో ఇజ్రాయెల్ దీనిని పొడిగించాలని కోరగా, హమాస్ తిరస్కరించింది. దీంతో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది.
సోమవారం, ఇజ్రాయెల్ దళాలు గాజాపై విరుచుకుపడ్డాయి. హమాస్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా దాడులు చేశాయి. గాజా ఆరోగ్య శాఖ ప్రకారం, ఈ దాడుల్లో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. రంజాన్ మాసంలో ఇజ్రాయెల్ ఐడీఎఫ్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 70 మంది గాయపడ్డారు.
హమాస్ అంతమే లక్ష్యంగా ..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడులపై స్పందించారు. హమాస్ పదేపదే బందీలను విడిచిపెట్టేందుకు నిరాకరించిందని, అమెరికా అధ్యక్ష రాయబారి స్టీవ్ విట్కాఫ్ ద్వారా పంపిన ప్రతిపాదనలను కూడా తిరస్కరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో హమాస్ అంతం కావాల్సిందేనని, దాడులు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. సెంట్రల్ గాజాలోని దేర్ అల్-బలాలో మూడు ఇళ్లు, గాజా నగరంలోని ఒక భవనం, ఖాన్ యూనిస్, రఫాల్లోని హమాస్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, ఇజ్రాయెల్ చర్యలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, దీనికి పూర్తి బాధ్యత నెతన్యాహునే వహించాలని ప్రకటించింది.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య చర్చలు నిలిచిపోయిన పరిస్థితి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోయాయి. మొదటి దశను పొడిగించాలని ఇజ్రాయెల్ కోరగా, హమాస్ ఒప్పుకోలేదు. మార్చి 2న ప్రారంభమయ్యే రెండవ దశలోనే బందీలను విడుదల చేస్తామని హమాస్ స్పష్టం చేసింది. అయితే, బందీలను అణచివేస్తోందని, వారిపై క్రూరంగా ప్రవర్తిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. 2023 అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి చేసింది. అనేకమంది ఇజ్రాయెలీ పౌరులను బందీలుగా తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ భీకర ప్రతిస్పందన ఇస్తూ, పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తోంది. గాజాలో వందలాది మంది పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు.