తిరుమల (Tirumala) నెయ్యి కల్తీ (Ghee Adulteration) వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్టు (Lie Detector Test)కైనా తాను సిద్ధమని వైసీపీ ఎంపీ, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) కూటమి ప్రభుత్వానికి (Coalition Government) సవాల్ విసిరారు. బోర్డు ఛైర్మన్ పదవిని దేవుడికి సేవ చేసే అవకాశంగానే తాను భావించానని, ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఆశించలేదని, తన కుటుంబ సభ్యులు సైతం బోర్డు వ్యవహారాల్లో కలగజేసుకోలేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ(TDP)తో పాటు కొన్ని మీడియా సంస్థలు తిరుమల ప్రతిష్ట (Reputation of Tirumala)ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో కేజీ నెయ్యి రూ.326కు కొనుగోలు చేశామని దానిని కల్తీ నెయ్యిగా ప్రచారం చేస్తున్నారని, అదే విధంగా టీడీపీ హయాంలో రూ.276, రూ.279 ధరలకు కొనుగోలు చేసిన నెయ్యిని కూడా కల్తీ నెయ్యిగా భావించాలా? అని ప్రశ్నించారు. 2019–24 మధ్య కాలానికి మాత్రమే పరిమితం కాకుండా గత 10–15 ఏళ్ల నెయ్యి సరఫరాలపై కూడా దర్యాప్తు జరగాలని సిట్ను కోరినట్లు తెలిపారు.
లడ్డూ ప్రసాదం (Laddu Prasadam)పై జరుగుతున్న విషప్రచారం వల్ల భక్తుల్లో (Devotees) అనుమానాలు పెరుగుతున్నాయని, రాజకీయ లాభాల కోసం ఇలాంటి పవిత్ర విషయాలను ఉపయోగించడం బాధాకరమని సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. సిట్ విచారణ కొనసాగుతుండగానే తప్పుదోవ పట్టించే లీక్లను ప్రచారం చేయడం ఆలయ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుందని అన్నారు. తిరుమలలో ల్యాబ్ పరీక్షలు కఠినంగా ఉంటాయని, నాణ్యతా ప్రమాణాలు లేని నెయ్యిని ఎప్పుడూ వెనక్కి పంపించేవారని, అలాంటి వ్యవస్థలో కల్తీ నెయ్యి లడ్డూల తయారీలోకి వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు.
తన హయాంలో టీటీడీలో ఎన్నో సంస్కరణలు చేశామని ఆయన గుర్తు చేశారు. తిరుమలలో VIP దర్శనాలకు కట్టడి, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పారదర్శకత, ప్లాస్టిక్ నిషేధం, గో ఆధారిత ఉత్పత్తుల వినియోగం, గోమాత పరిరక్షణ కార్యక్రమాలు, పిల్లల గుండె చికిత్సల కోసం శ్రీ పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను వివరించారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం వస్తూనే వైకుంఠ ఏకాదశి టోకెన్ల విషయంలో సరిగా వ్యవహరించక తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తిరుమల ప్రతిష్టను కాపాడడం అందరి బాధ్యత అని, రాజకీయ దురుద్దేశాలతో పవిత్రమైన దేవాలయాన్ని వేదికగా చేయడం ఆపాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.








