భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారికి సంబంధించిన వివాదాలు ఊపందుకుంటూనే ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, కొండపై మాంసాహారం, లడ్డూ ప్రసాద భవనంలో అగ్నిప్రమాదం మొదలుకొని ఇప్పుడు హుండీ లెక్కింపులో దొంగతనాల వరకు వెళ్లిపోయాయి. అయితే, ఈసారి వివాదం తిరుమల ఆలయంలో కాదు, చెన్నైలోని శ్రీవారి ఆలయంలో చోటు చేసుకుంది. భక్తులు వెంకన్నకు సమర్పించిన నగదు కానుకల్లో టీటీడీ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో టీటీడీ అధికారులు అతడిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు.
హుండీ లెక్కింపులో అక్రమాలు
చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణి లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ విదేశీ కరెన్సీని స్వాహా చేసినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విభాగం గణన ప్రకారం, గత సంవత్సరం ఒక నెలలో రూ.6 లక్షల విలువైన విదేశీ కరెన్సీ మాయమైనట్లు గుర్తించారు.
విజిలెన్స్ విచారణ – ఉద్యోగి సస్పెన్షన్
హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని ప్రతి నెల 1వ తేదీన తిరుమల పరకామణిలో జమ చేయాల్సి ఉంటుంది. అయితే, లెక్కింపులో తేడాలు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ వింగ్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించింది. ఈ విషయాన్ని ఈవో శ్యామలరావుకు నివేదిక అందించగా, ఆ నివేదిక ఆధారంగా కృష్ణ కుమార్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
భక్తుల ఆగ్రహం
ఇప్పటికే వరుస వివాదాలతో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. భక్తుల్లో ఎంతో విశ్వాసం ఉన్న తిరుమల వెంకన్నకు దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఎక్కడ ఏమైనా జరిగినా, టీటీడీయే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు హుండీ ఆదాయాన్ని స్వంత ఉద్యోగులే దోచుకుంటున్నారనే వార్తలు భక్తుల నమ్మకాన్ని దిగజార్చుతున్నాయి.