తిరుమల (Tirumala) పరకామణి (Parakamani) అక్రమాల కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న టీటీడీ(TTD) మాజీ ఏవీఎస్ఓ (AVSO) సతీష్ కుమార్ (Satish Kumar) అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాడిపత్రి (Tadipatri) నియోజకవర్గంలోని జుటూరు – కోమలి (Jutur- Komali) రైల్వే ట్రాక్ సమీపంలో ఆయన మృతదేహం లభ్యమైన ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ఆర్ఐగా గుంతకల్లో పనిచేస్తున్న సతీష్ కుమార్ది ఆత్మహత్య కాదని, ఇది పథకం ప్రకారమే జరిగిన హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సతీష్ కుమార్ సోదరుడు హరి మాట్లాడుతూ.. ఎవరో రైలు నుంచి బయటికి లాగి మా అన్నను హత్య చేశారని ఆరోపించారు. సాధారణంగా ఆ రైలు ఆ ప్రదేశంలో ఆగదని, ఆ సమయంలో రైలు ఎందుకు ఆగిందో అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. అంతేకాదు, మృతదేహం రైల్వే ట్రాక్కు దూరంగా 10 మీటర్ల దూరంలో పడడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందన్నారు. ప్రాణహాని ఉందని సతీష్ తరచూ చెప్పేవాడని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సతీష్కు దగ్గర స్నేహితుడు రామాంజనేయులు కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేశారు. పరకామణి కేసుకు సంబంధించిన పైఅధికారుల నుంచి భారీ ప్రెషర్ ఉందని తరచూ తనతో చెప్పేవాడని అన్నారు. సూసైడ్ చేసుకునే వ్యక్తే కాదని, ఇటువంటి తీవ్ర నిర్ణయం తీసుకునే స్వభావం ఆయనకు లేదని స్పష్టం చేశారు. పరకామణి కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ మరణం జరగడం మరింత అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు.
రైల్వే అధికారులు కూడా స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం అనుమానాలను మరింతగా బలపరుస్తోంది. ఎలా చనిపోయారో ఇప్పుడే చెప్పలేమని రైల్వే డీఎస్పీ స్పందించడంపై కుటుంబ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని, సీసీటీవీ ఫుటేజీలు, రైల్వే స్టాప్ వివరాలు, కాల్ డేటా రికార్డులు వెలుగులోకి తేవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.








