మూడు ఘటనలు.. నూరు వక్రీకరణలు

మూడు ఘటనలు.. నూరు వక్రీకరణలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా కూట‌మి పార్టీల నోళ్ల‌న్నీ వైసీపీ నామాన్నే జ‌పిస్తున్నాయి. జ‌రిగిన సంఘ‌ట‌న‌, దాని పూర్వాప‌రాల‌తో సంబంధం లేకుండా ట‌క్కున వైసీపీ వ‌ల్లే అని ఆ పార్టీపై మోపేస్తున్నారు. రాయలసీమలో ఇటీవల జరిగిన మూడు వేర్వేరు ఘటనలను వైసీపీపై నెట్టేందుకు జ‌రిగే కుట్రను ఆ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవాలు పరిశీలిస్తే.. ఈ మూడు ఘటనలతో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని స్ప‌ష్టంగా అర్థ‌మవుతోంది.

1. కర్నూలులో సంజన్న హత్య కేసు
కర్నూలు శరీన్‌నగర్‌లో నివాసం ఉండే మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్‌ జయరాం తండ్రి కోశపోగు సంజన్నను శుక్రవారం రాత్రి అదే కాలనీలో దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. గతంలో సీపీఎం తరపున కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరి కుమారుడు జయరాంను కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. కొంతకాలంగా సంజన్నకు, మరో టీడీపీ నేత వడ్డె రామాంజనేయులు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇరువర్గాల మధ్య దాడి ఘటనలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కాలనీలోని గుడికల్‌ అలిపిరా స్వామి భజన కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా సంజన్నపై దుండగులు కత్తులతో దాడి చేశారు.. ఆయన తలను నరికి అక్కడి నుంచి పారిపోయారు. ఆయన అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సంజన్న చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. టీడీపీ కార్యకర్తలు భారీగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వ‌ద్ద‌కు చేరుకొని, ఆ కోపంలో సంజన్న అనుచరులు వడ్డే రామాంజనేయులు వాహనంపైన రాళ్ల దాడి చేశారు. వడ్డె రామాంజనేయులతో పాటుగా ఆయన కుమారులు, మరికొందరు ఘటనలో పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణతో తెలిసింది. హత్యకు గురైన సంజన్న, హత్య చేసిన రామాంజనేయులు కూడా టీడీపీనే, ఇద్దరూ రౌడీషీటర్లే. అనేక కేసులలో ముద్దాయిలు, ఈ హత్యకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు.

2. పుంగనూరులో కాగితి రామకృష్ణనాయుడి హత్య కేసు
పుంగనూరు మండలం చండ్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రామకృష్ణనాయుడు(55), వెంకటరమణ దాయాదులు. గత పదేళ్ళుగా వీరి మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈ విషయమై రామకృష్ణ, అతని కుటుంబ సభ్యులపై వెంకటరమణ, అతని అనుచరులు పలుమార్లు దాడులు చేశారు. ఈ క్రమంలోనే గత శుక్రవారం రాత్రి రామకృష్ణను దారుణంగా హతమార్చారు. దాడిలో రామకృష్ణ కుమారుడు సురేశ్‌కుమార్‌ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడి మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రామకృష్ణ 15 రోజుల కిందట తన పొలంలో ట్రాక్టర్‌తో మట్టి తరలిస్తుండగా వెంకటరమణ, గణపతి, మహేశ్, త్రిలోక్‌.. ట్రాక్టర్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగి కొట్టారు. అడ్డువచ్చిన రామకృష్ణనూ చితకబాదారు. అతని కుమారుడు సురేశ్, కోడలిపైనా దాడి చేశారు. దీనిపై బాధితులు అప్పట్లోనే సీఐ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. నిందితులను కేవలం ఐదు నిమిషాలు సెల్‌లో ఉంచి వదిలేశారు. శుక్రవారం రాత్రి కృష్ణాపురంలో నరసింహస్వామి రథం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.

శనివారం ఉదయం సురేష్ ఓ దుకాణం ముందు కూర్చొని ఉండగా, వేట కొడవలితో వచ్చిన వెంకటరమణ అతన్ని చంపేందుకు ప్రయత్నించాడు. చేతికి గాయాలపాలైన సురేశ్‌ తప్పించుకొని పారిపోయాడు. అదే సమయంలో ట్రాక్టర్‌పై వస్తున్న రామకృష్ణపై కూడా వెంకటరమణ దాడి చేసి మెడపై నరికాడు. వెంటనే రామకృష్ణను అతని బంధువులు చికిత్స కోసం తిరుపతికి తీసుకెళ్తుండగా అన్నమయ్య జిల్లా కలికిరి సమీపంలో మరణించాడు. వెంకటరమణ వైసీపీలో తిరుగుతుండడంతో దాయాదుల ఆస్తి గొడవను వైసీపీకి అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంకటరమణ నుంచి తనకు ప్రాణహాని ఉందని మృతుడు రామకృష్ణ గతంలో ఒక వీడియో ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించిన సీఐ శ్రీనివాసులు, హెడ్‌ కానిస్టేబుల్‌ సుబ్రహ్మణ్యాన్ని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ కేసుకు ఈ హత్యకు పాలిటిక్స్‌కు ఎటువంటి సంబంధం లేదు.

3. దస్తగిరి భార్య కేసు
వైఎస్సార్‌ జిల్లా మల్లేలకు చెందిన షంషూన్, పర్వీన్‌ తన ఇంట్లోకి వచ్చి అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారని వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్య షబానాపై ఆదివారం ఆరోపించింది. ‘మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఏడాదిలో నీ భర్తను నరికేస్తాం’ అని బెదిరించినట్లు విలేకరులకు చెప్పింది. మల్లేలకు చెందిన వైసీపీ నాయకుడు రవి ఏడాదిలోగా దస్తగిరిని నరికి చంపుతారంటూ వారు తనపై దాడి చేసి బెదిరించారని షబానా ఆరోపించింది. వాస్తవానికి చిట్టీ డబ్బుల విషయమై జరిగిన వ్యక్తిగత గొడవను రాజకీయం చేయడానికి దస్తగిరి కుటుంబం ప్రయత్నిస్తోంది. దస్తగిరి భార్య షబానాది వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం మల్లేల గ్రామం. సొంతూరికి వెళ్లిన షబానాను చిట్టీ డబ్బులు ఎందుకు కట్టలేదని చిట్టీ కట్టించుకునే మహిళ వచ్చి నిలదీసింది. దీంతో వారి మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ గొడవకు రాజకీయాలు అంటగట్టి వివేకా హత్య కేసుతో లింకు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment