కరూర్ (Karur) తొక్కిసలాట (Stampede) ఘటన కేసులో తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి విజయ్కు(CM Vijay) సుప్రీంకోర్టులో (Supreme Court) భారీ ఊరట లభించింది. కరూర్ ఘటనపై సీఎం విజయ్, మంత్రి ఆధవ్ అర్జున్తో (Aadhav Arjuna) పాటు టీవీకే(TVK) నేతలు బహిరంగ ప్రకటనలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి (R.S. Bharathi) దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా(Ahsanuddin Amanullah), జస్టిస్ షీల్ నాగు (Sheel Nagu) ధర్మాసనం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ, నమోదైన ఎఫ్ఐఆర్లో సీఎం విజయ్ పేరు నిందితుడిగా లేదని స్పష్టం చేసింది. ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాలి, ఏం మాట్లాడాలి అనే విషయాలను కోర్టులు నియంత్రించలేవని పేర్కొంటూ, రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాలను వేదికగా మార్చవద్దని పిటిషనర్కు సూచించింది. దీంతో డీఎంకే తన పిటిషన్ను ఉపసంహరించుకుంది.
గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన టీవీకే ర్యాలీలో(TVK Rally) జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. జూలై 10, 11 తేదీల్లో సీఎం విజయ్ కరూర్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వ ఆర్థిక సాయం అందించనున్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. బాధితులే కీలక సాక్షులని, సీఎం పర్యటనతో సీబీఐ(CBI) విచారణపై ప్రభావం పడొచ్చని డీఎంకే వాదించినప్పటికీ, సుప్రీంకోర్టు ఆ వాదనలను తోసిపుచ్చింది. దీంతో సీఎం విజయ్ కరూర్ పర్యటనకు ఉన్న అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.








