హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్లో దారుణ ఘటన వెలుగుచూసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఆమెను పనిమనిషి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
వివరాల్లోకి వెళ్తే..
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే తన భార్యతో కలిసి జూబ్లీహిల్స్లోని ఐఏఎస్ క్వార్టర్స్లో నివసిస్తున్నారు. అయితే, ఇంట్లో పనిచేసే వ్యక్తి (పనిమనిషి) ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
సీన్ ఆఫ్ అఫెన్స్ను పరిశీలించిన సీపీ
హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న సీపీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. నగరంలోని అత్యంత విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐఏఎస్ క్వార్టర్స్లో ఇలాంటి దారుణం జరగడం కలకలం రేపుతోంది. పనిమనుషుల వివరాలను పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా మరోసారి హెచ్చరిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.








