తమిళనాడులో రాజకీయ పరిణామాలు సినిమాను తలపిస్తున్నాయి. ప్రజల తీర్పును గౌరవించి ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే (TVK) అధినేత విజయ్ని ఆహ్వానించడంలో గవర్నర్ జాప్యం చేయడంపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటులు ప్రకాష్ రాజ్, విశాల్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ గవర్నర్ తీరును తప్పుపట్టారు.
ఇది రాజ్యాంగ విరుద్ధం: ప్రకాష్ రాజ్
గవర్నర్ ప్రవర్తనపై నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. “గవర్నర్ తీరు అసహ్యకరంగా ఉంది. ఇది ఆమోదయోగ్యం కాదు, రాజ్యాంగ విరుద్ధం. మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా.. విజయ్కు ప్రజల మద్దతు (Mandate) ఉంది. సభలోనే తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఆయనకు ఇవ్వాలి” అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
ప్రజల తీర్పుకు గౌరవం ఎక్కడ? – విశాల్
మరోవైపు హీరో విశాల్ కూడా సోషల్ మీడియా వేదికగా గవర్నర్ వైఖరిని ప్రశ్నించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేశారు. 2017-18 కాలంలో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు.. ఫ్లోర్ టెస్ట్ ద్వారా మెజారిటీ నిరూపించుకోవాలని అక్కడి గవర్నర్లు ఆదేశించారని విశాల్ గుర్తు చేశారు.
అదే నిబంధనలు తమిళనాడులో ఎందుకు అమలు కావడం లేదని ఆయన నిలదీశారు. విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని, అసలు ప్రజల తీర్పుకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని విశాల్ మండిపడ్డారు.
విజయ్కు పెరుగుతున్న మద్దతు
గవర్నర్ తీరుపై కేవలం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. విజయ్కు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు చూపుతూ కాలయాపన చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని టీవీకే శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్, విశాల్ వంటి ప్రముఖులు కూడా రంగంలోకి దిగడంతో ఈ వివాదం మరింత జాతీయ స్థాయికి చేరింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మరికాసేపట్లో తీసుకోబోయే నిర్ణయంపై ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.








