తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్-బీజేపీ (Congress-BJP) అంతర్గత బంధం సాక్షాత్తూ మోడీ (Narendra Modi) మాటలతో బయటపడింది. ఆదివారం హైదరాబాద్లోని (Hyderabad) హెచ్ఐసీసీ (HICC) వేదికగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సభలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఒకరిపై ఒకరు కురిపించుకున్న ప్రశంసలు, ఇచ్చుపుచ్చుకున్న ఆఫర్లు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
“మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి ఒంటరిగా చేరలేరు.. కాబట్టి నాతో కలవండి” అంటూ రేవంత్ రెడ్డికి మోడీ బహిరంగంగానే ఆఫర్ (Offer) ఇచ్చారు. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి, పక్కా రాజకీయ వ్యూహంతో రేవంత్ను బీజేపీ వైపు ఆహ్వానించినట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు సైతం అవాక్కవుతున్నారు.
రేవంత్ ‘నమో’ జపం.. వికసిత్ భారత్కు జై!
కాంగ్రెస్ అధిష్టానం దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ను, వారి ‘వికసిత్ భారత్’ (Viksit Bharat 2047) నినాదాన్ని వ్యతిరేకిస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. “ముందు దేశం.. తర్వాతే పార్టీ” అని రేవంత్ పేర్కొనడం విశేషం. మోడీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్ 2047’లో తాము భాగస్వాములమవుతామని ప్రకటించారు. కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా ‘తెలంగాణ రైజింగ్ 2047′(Telangana Rising 2047) ను రూపొందించామని చెప్తూ, మోడీతో తమకు ఉన్న సానుకూల బంధాన్ని నొక్కి చెప్పారు.
గుజరాత్ కంటే ఎక్కువే ఇస్తా.. కానీ!
గుజరాత్కు (Gujarat) ఇచ్చిన దానికంటే రెట్టింపు నిధులు తెలంగాణకు ఇవ్వాలని రేవంత్ కోరగా.. మోడీ దానికి బదులిస్తూ, గుజరాత్కు ఇచ్చిన నిధులు ఇస్తే ఇప్పుడు తెలంగాణకు వస్తున్న దాంట్లో సగం కూడా రావని చురకలంటించారు. అయితే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే తనతో జతకట్టాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని రేవంత్కు మోడీ పరోక్షంగా బీజేపీ(BJP) లైన్లోకి రావాలని సూచించినట్లు కనిపిస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తానికి, హైదరాబాద్ వేదికగా సాగిన ఈ ప్రహసనం చూస్తుంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ను(BRS) ఎదుర్కోవడానికి కాంగ్రెస్-బీజేపీలు ఒకే తాటిపైకి వచ్చాయన్న ఆరోపణలు నిజమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.








