అభిమాని నిరంజన్ కన్నుమూత.. పవన్ ట్వీట్

పవన్ కళ్యాణ్‌ అభిమాని నిరంజన్ కన్నుమూత

Summarize with AI

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమాని 17 ఏళ్ల నిరంజన్ మృతి చెందాడు. కొంతకాలంగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను మంగళవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. ఈ వార్తతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

తెలంగాణ రాష్ట్రం హనుమకొండలోని హనుమాన్‌నగర్‌కు చెందిన నిరంజన్ కొంతకాలంగా జన్యుపరమైన కండరాల క్షీణత వ్యాధితో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గత నెల స్వయంగా హనుమకొండకు వెళ్లి తన అభిమాని నిరంజన్‌ను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అంతేకాకుండా, నిరంజనకు ఆర్థిక సహాయం అందించి, ఓజీ 2 సినిమా క‌లిసి చూద్దామ‌ని భ‌రోసా ఇవ్వ‌డంతో పాటు ఐప్యాడ్ కొనిచ్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలుడి చివరి కోరికను నెరవేర్చేందుకు స్వయంగా వెళ్లి కలవడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే నిరంజన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి అతను కన్నుమూశాడు.

నిరంజన్ మృతిపై స్థానికులు, పలువురు ప్రముఖులు, జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే నిరంజన్ మృతి చెందడం బాధాకరమని, అతని కుటుంబానికి మనోధైర్యం కలగాలని వారు ఆకాంక్షించారు.

పవన్ కళ్యాణ్ ట్వీట్
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని పవన్ ట్వీట్ చేశారు. నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా తన మదిలో సజీవంగానే ఉన్నాయని చెప్పారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment