నేపాల్లో(Nepal) భారీ వర్షాలు(Heavy Rains), ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల ప్రభావంతో వివిధ దేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు (Tourists) గల్లంతైనట్లు సమాచారం. మొత్తం 33 దేశాలకు చెందిన పర్యాటకులు ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో భారతీయులు (Indians) అత్యధికంగా 290 మంది ఉన్నారు. అమెరికాకు (USA) చెందిన 65 మంది, ఉక్రెయిన్కు (Ukraine) చెందిన 53 మంది, మలేషియాకు(Malaysia) చెందిన 51 మంది, ఆస్ట్రేలియాకు (Australia) చెందిన 35 మంది, బ్రిటన్కు (Britain) చెందిన 33 మంది పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయా దేశాల అధికారులు తమ పౌరుల ఆచూకీ కోసం నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నారు.
ఇక కెనడాకు (Canada) చెందిన 25 మంది, సింగపూర్కు (Singapore) చెందిన 9 మంది పర్యాటకులు కూడా గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదల్లో చిక్కుకున్న పర్యాటకులను గుర్తించేందుకు నేపాల్ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వారి వివరాలను సేకరిస్తూ, వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆయా దేశాల రాయబార కార్యాలయాలు నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ తమ పౌరుల సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో సహాయక చర్యలకు సవాళ్లు ఎదురవుతున్నాయి.







