‘పహల్గామ్’ (Pahalgam)లో అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు (Terrorists) భారత్(India) దీటైన జవాబు ఇచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్ (Pakistan)లోని లష్కరే తోయిబా (Lashkar-e Toiba), జైషే మహ్మద్ (Jaish-e Mohammed) ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది.
ఈ దాడుల్లో అత్యంత సంచలన విషయం ఏమిటంటే, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ (Masood Azhar) కుటుంబం (Family) మొత్తం హతమైంది. ఈ విషయాన్ని ఇప్పటివరకు పాకిస్తాన్ ఒప్పుకోలేదు. కానీ, తాజాగా జైషే మహ్మద్ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ దీనిని ధ్రువీకరించారు. మే 7వ తేదీ రాత్రి బహవల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం ‘జామియా మసీదు సుభాన్ అల్లాహ్’ పై భారత సైన్యం జరిపిన దాడిలో అజార్ కుటుంబం ‘ముక్కలు ముక్కలు అయింది’ అని కాశ్మీరీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ చేపట్టింది. ఈ దాడుల్లో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ వైమానిక దాడుల్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. వారిలో అతని సోదరి, ఆమె భర్త, అతని మేనల్లుడు, మేన కోడలు మరియు వారి కుటుంబానికి చెందిన పిల్లలు ఉన్నారు. అజార్ సహాయకులు నలుగురు కూడా ఈ దాడిలో మరణించారు. ఐక్యరాజ్యసమితి నిషేధించిన అజార్, 2016 పఠాన్కోట్, 2019 పుల్వామా దాడులకు ప్రధాన సూత్రధారి.







