ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అడ్డగోలు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు త్వరలోనే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తాజాగా మీడియాలో మాట్లాడిన ఆయన, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలువ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు.
జగన్ ఇచ్చిన మాట తప్పడు..
“జగన్ మోహన్ రెడ్డి అంటేనే విశ్వసనీయతకు మారుపేరు. 2029 ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని కచ్చితంగా నమ్ముతారు. జగన్ ప్రభుత్వం ఉంటేనే తమకు మంచి జరుగుతుందని నిరుపేద వర్గాలంతా ఇప్పుడు బలంగా భావిస్తున్నారు. ఆయన్ని వదులుకున్నామని సామాన్య ప్రజలు బాధపడుతున్న రోజులు దగ్గర్లోనే ఉన్నాయి” అని నాని వ్యాఖ్యానించారు. 2029లో జగన్ను సీఎం అవ్వకుండా అడ్డుకునే సత్తా ఈ కూటమికి లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆస్తి పంపకాలు..
జగన్ మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారాలపై కూటమి చేస్తున్న విమర్శలను కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. “తండ్రి చనిపోతే తండ్రి ఆస్తిలో వాటాలు ఇచ్చేవారిని చూశాం. కానీ తన సొంత కష్టార్జితంలో కూడా చెల్లెళ్లకు వాటాలు ఇచ్చిన వ్యక్తి జగన్. ఆయనపై దారుణంగా నిందలు వేస్తున్నా, సంస్కారంతో ఎక్కడా తన చెల్లెళ్ల గురించి తప్పుగా మాట్లాడలేదు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన ఇంట్లోని ఆడబిడ్డలను రోడ్డు మీదకు తెచ్చిన నీచ చరిత్ర చంద్రబాబుది” అని మండిపడ్డారు.
లడ్డూ ఇష్యూపై దేవుడే మొట్టికాయలు
తిరుపతి లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయం బెడిసికొట్టిందని కొడాలి నాని విమర్శించారు. “లడ్డూ వ్యవహారంలో దేవుడే కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు వేశాడు. వాళ్లు ఎలా అభాసుపాలయ్యారో ప్రపంచమంతా చూసింది. దేవుడి దయతో, ప్రజల సహకారంతో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం” అని స్పష్టం చేశారు. రుణమాఫీపై చంద్రబాబు మాట నమ్మిన రైతులు, డ్వాక్రా మహిళలు గత ఐదేళ్లు (2014-19) ఎలా నష్టపోయారో, ఎన్ని బాధలు అనుభవించారో అందరికీ తెలుసు” అని దుయ్యబట్టారు.
సూపర్ సిక్స్ కాదు.. సూపర్ మోసం
“2024లో జగన్ను ఓడించడానికి దొంగలంతా ఒక్కటయ్యారు. జగన్ కంటే ఎక్కువిస్తామని ‘సూపర్ సిక్స్’ పేరుతో దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. జగన్ చేసిన మంచి వల్ల ఇవాళ వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కూటమి నేతలే ఒకరినొకరు విమర్శించుకునే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వానికి జనం గూటం దించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి” అంటూ కొడాలి నాని హెచ్చరించారు.








