కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) వేదికగా మరోసారి భారతీయ అందాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నటి ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) ఈసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్కు (Trolling) గురయ్యారు. తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) తో కలిసి రెడ్ కార్పెట్పై (Red Carpet) ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపించిన ఐశ్వర్య లుక్, ఆమె ధరించిన అవుట్ఫిట్స్పై కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆమె వయసును టార్గెట్ చేస్తూ వచ్చిన ట్రోల్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ విమర్శలపై బాలీవుడ్ ఫైర్బ్రాండ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఘాటుగా స్పందిస్తూ ఐశ్వర్యకు బలమైన మద్దతుగా నిలిచారు.
“ఫ్యాషన్ (Fashion) అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం.. ఎవరికీ నచ్చినట్లు వారు ఉండే హక్కు ఉంది” అంటూ కంగనా ట్రోలర్స్పై మండిపడ్డారు. “ఐశ్వర్యను విమర్శించే ముందు మీ ఫ్యాషన్ సెన్స్ ప్రపంచానికి చూపించండి” అంటూ సవాల్ విసిరిన ఆమె.. “రెడ్ కార్పెట్పై కేవలం యువ నటీమణులే ఉండాలనుకోవడం తప్పు, 50 ఏళ్ల మహిళలు కూడా అదే ఆత్మవిశ్వాసంతో మెరవగలరు” అని స్పష్టం చేశారు. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళలపై జరిగే బాడీ షేమింగ్, లుక్ ట్రోలింగ్ను కంగనా సరైన రీతిలో ఎండగట్టిందంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్న ఐశ్వర్యను వయసు పేరుతో ట్రోల్ చేయడం సరైంది కాదన్న కంగనా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








