పాకిస్థాన్ హై డ్రామాకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్పై కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం సూచనల కారణంగా ఆ మ్యాచ్కు హాజరుకాకపోవచ్చని అక్కడి బోర్డు ప్రకటించింది.
దీంతో ఈ హై వోల్టేజ్ పోరు జరుగుతుందా లేదా అన్న సందేహం అభిమానుల్లో పెరిగింది. అయితే వీకెండ్లో పరిస్థితి మారింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి అధికారికంగా సమాచారం ఇచ్చి, షెడ్యూల్ ప్రకారం అన్ని మ్యాచ్లలో పాల్గొంటామని తెలిపింది. దీంతో ఈ కీలక మ్యాచ్పై ఉన్న అనిశ్చితికి తెరపడింది.
ఈ అంశంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషాటే స్పందించారు. ఈ పరిణామాలు జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. శ్రీలంక బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. “మేము మొదటినుంచే మ్యాచ్ జరుగుతుందని భావించాం. వాళ్లు రాకపోతేనే వేరే విషయం. అప్పటివరకు ఆడతామనే సిద్ధంగా ఉన్నాం” అన్నారు. అంటే బయట ఏం జరిగినా డ్రెస్సింగ్ రూమ్లో మాత్రం ఒక్క దృష్టి క్రికెట్పైనే ఉందని చెప్పేశారు.
రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల గురించి ఆయన ప్రస్తావించారు. కానీ ఆ విషయాలను పక్కన పెట్టి, కేవలం ఆటపైనే దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని చెప్పారు. దేశంలో భావోద్వేగాలు ఉంటాయి, రాజకీయ విషయాలు ఉంటాయి. కానీ మా పని మైదానంలో రాణించడమని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్కు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉండొచ్చని ఒప్పుకున్నారు. గత రెండు వారాలుగా ఆ జట్టు కొలంబోలోనే ఉండటంతో అక్కడి పరిస్థితులకు అలవాటు అయిపోయిందని చెప్పారు. ఇది సవాలే కానీ.. తాము ఎదుర్కోగలమని స్పష్టం చేశారు.








