హైదరాబాద్లో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఇది సాధారణ హిట్ అండ్ రన్ ప్రమాదంగా కనిపించినా, పోలీసుల దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని తేలింది. రెడ్హిల్స్ శాంతినగర్లో జరిగిన ఈ ఘటన వెనుక భూ వివాదాల కోణం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భూ వ్యవహారాల్లో ఖాజా మొయినుద్దీన్ అడ్డుగా మారుతున్నాడనే కారణంతో ప్రత్యర్థులు అతన్ని తొలగించాలనే కుట్ర పన్నినట్లు సమాచారం. ఇందుకోసం ఏడాది కాలంగా సుపారీ ముఠాలతో సంప్రదింపులు జరిపినట్లు విచారణలో బయటపడింది. డిసెంబర్లో కిషన్సింగ్ అలియాస్ పప్పుకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ హత్యను ప్రమాదంలా చూపించేందుకు నిందితులు ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించాలని భావించిన ముఠా, ఇందుకోసం కారు స్టంట్స్లో నిపుణుడైన అభిజిత్ను రంగంలోకి దింపినట్లు సమాచారం. హత్యకు ఉపయోగించేందుకు సెకండ్హ్యాండ్ కారు కొనుగోలు చేసి పలుమార్లు రిహార్సల్స్ కూడా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు మూడు రోజుల ముందు నుంచే ఖాజా మొయినుద్దీన్ కదలికలపై నిందితులు నిఘా పెట్టినట్లు గుర్తించారు. ఈ నెల 22న నారాయణగూడలోని ఓ హోటల్లో సమావేశమై చివరి స్కెచ్ సిద్ధం చేసుకున్న తర్వాత తెల్లవారుజామున ఇంటి వద్ద కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అయితే ఘటనలో ఉపయోగించిన రెండు కార్లకు ఎలాంటి నష్టం జరగకపోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ఇది సాధారణ ప్రమాదం కాదని స్పష్టంగా నిర్ధారించారు. నెంబర్ ప్లేట్ లేని కారుతో దాడి చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో కిషన్సింగ్, వినయ్, నాని, అభిజిత్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే వినయ్ను అదుపులోకి తీసుకుని టాస్క్ఫోర్స్ అధికారులు విచారిస్తుండగా, అభిజిత్, నాని, కిషన్సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిని పట్టుకుంటే అసలు సూత్రధారి ఎవరో బయటపడే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.








సుగాలి ప్రీతి కేసును పవన్ రాజకీయానికి వాడుకున్నాడు