చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)ను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
ఈ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) తొలి సమావేశంలో 7 ముఖ్యమైన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. డీలిమిటేషన్ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరిపి మాత్రమే ముందుకు వెళ్లాలని కమిటీ స్పష్టం చేసింది.
7 కీలక తీర్మానాలు ఇవే
పారదర్శకత: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ఇతర భాగస్వామ్యులతో సంప్రదింపులు జరపాలి.
1971 జనాభా లెక్కల ప్రాతిపదిక: జనాభా స్థిరీకరణ లక్ష్యం ఇంకా పూర్తికాలేదని, కనీసం మరొ 25 ఏళ్లపాటు నియోజకవర్గాల సంఖ్యను మార్చరాదని నిర్ణయించారు.
జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు న్యాయం: జనాభా నియంత్రణ చర్యలు అమలు చేసిన రాష్ట్రాలను శిక్షించకూడదు. దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటరీ వ్యూహం: డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించేందుకు JACలో భాగమైన రాష్ట్రాల ఎంపీలతో ప్రత్యేక కోర్ కమిటీ ఏర్పాటు చేసి పార్లమెంటరీ వ్యూహాన్ని సమన్వయం చేయాలని తీర్మానించారు.
ప్రధానమంత్రి వద్ద వినతిపత్రం: పార్లమెంటులో భారత ప్రధానమంత్రికి ఈ తీర్మానాల ప్రతిపాదన సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
రాష్ట్ర శాసనసభ తీర్మానాలు: ప్రతి రాష్ట్రంలో శాసనసభ తీర్మానాలను ప్రవేశపెట్టి, కేంద్ర ప్రభుత్వానికి ఈ డిమాండ్లను తెలియజేయాలని రాష్ట్రాల నేతలు ఒక గొంతుకతో నిర్ణయించారు.
ప్రజా చైతన్య కార్యక్రమాలు: గత డీలిమిటేషన్ చరిత్ర, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో తలెత్తే సమస్యలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు JAC ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది.
ఈ తీర్మానాలు దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ పై ఏకతాటిపై ఉన్నట్లు స్పష్టంచేశాయి. ఇకపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.