ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పుష్కరకాలం దాటిన తర్వాత, సొంత రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించుకుంటున్న నివాసం ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. వెలగపూడిలో అత్యంత విలాసవంతంగా నిర్మితమవుతున్న ఈ ‘ప్యాలెస్’ వెనుక భారీ భూ అక్రమాలు ఉన్నాయంటూ నెటిజన్లు, ప్రతిపక్ష మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
శ్మశానవాటిక స్థలంలో విల్లా?
చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి పేరుతో జరిగిన ఒక భూ లావాదేవీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. శ్మశానవాటికకు కేటాయించిన స్థలాన్ని (163-బి) ల్యాండ్ పూలింగ్లోకి తీసుకుని, దాని ద్వారా వచ్చిన 1000 గజాల రిటర్నబుల్ ప్లాట్ను ఆమె కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ కేటాయింపులు జరిగాయనేది ప్రధాన విమర్శ.
పేదలకు చోటు లేకుండా ‘హరిత ప్రాంతం’?
ఈ నివాస నిర్మాణంపై మరో తీవ్రమైన ఆరోపణ వినిపిస్తోంది. చంద్రబాబు నివాసం పక్కన ఉన్న దక్షిణం వైపు స్థలంలో దళితులు, బీసీలు మరియు నిరుపేదలకు నివాస స్థలాలు రాకూడదనే ఉద్దేశంతో కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు.
బ్రాహ్మణి కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఆ స్థలంలో ‘రైతులకు నివాస స్థలాలు’ ఉంటాయని స్పష్టంగా ఉంది. కానీ, కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత సీఆర్డీఏ (CRDA) నిబంధనలను మార్చి ఆ ప్రాంతాన్ని ‘హరిత ప్రాంతం’ (Green Belt)గా ప్రకటించిందని అంటున్నారు. దీనివల్ల పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు దక్కకుండా చేశారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కరకట్ట నివాసం నుంచి.. వెలగపూడి వరకు!
ఇన్నాళ్లూ హైదరాబాద్లో స్థిరనివాసం ఉన్న చంద్రబాబు, ఏపీలో కట్టుకుంటున్న మొదటి ఇల్లు కూడా వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన నివసిస్తున్న కరకట్ట నివాసం (లింగమనేని గెస్ట్ హౌస్) కూడా అక్రమ కట్టడమని, నదీ సంరక్షణ చట్టాలను ఉల్లంఘించిందని గత వైసీపీ ప్రభుత్వం ఆధారాలతో సహా నిరూపించిన విషయాన్ని ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
“ఒకవైపు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూమి లేదంటూనే, మరోవైపు ముఖ్యమంత్రి కుటుంబం కోసం శ్మశాన వాటిక స్థలాలను కూడా వదలకుండా వాడుకోవడం ఏంటని?” రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వెలగపూడి నివాసం చుట్టూ జరుగుతున్న ఈ ప్రచారంపై ప్రభుత్వం లేదా నారా కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.
వెలగపూడిలో చంద్రబాబు గారి కుటుంబం అవినీతి ప్యాలెస్
— Andhra Now 📰 (@AndhraXpress) May 6, 2026
శ్మశాన స్థలంను (163-బీ) ల్యాండ్ పూలింగ్ ఇచ్చి
దాని ద్వార వచ్చిన 1000 గజాల రిటర్నబుల్ ఫ్లాట్ ను కొనుగోలు చేసిన నారా బ్రాహ్మణి గారు
చంద్రబాబు గారి ఇంటి పక్కన దక్షణం వైపు దళితులకు బీసీలకు నిరుపేదలకు నివాస స్థలం రాకూడదని స్థలం… pic.twitter.com/l4VBGazLDw








