తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్లలో రైతన్నా.. మీ కోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రైతులందరూ ఇబ్బందులు పడ్డారని సీఎం ఆరోపించారు. ఓ వైపు సూపర్ సిక్స్ – మరోవైపు చూస్తే ఖజానా ఖాళీగా ఉందన్నారు. వెతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదని, అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరన్నారు. అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదన్నారు. అయితే ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తా.. పేదవాడిని కోటీశ్వరుడిని చేస్తానన్న చంద్రబాబు.. ఇవాళ ఖజానా ఖాళీ, అప్పులు పుట్టడం లేదని చెప్పడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రైతులు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, వేరే వాళ్ల ఆరోగ్యాన్ని చెడగొట్టదని సీఎం చంద్రబాబు సూచించారు. రైతులు పంట పండించి ఎరువు వేసి మిగిలిన వాళ్లందరికీ క్యాన్సర్ అంటిస్తే సఫర్ అయ్యేది వాళ్లేనని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తాను ఎయిడ్స్పై అవగాహన కల్పించానని, లారీ డ్రైవర్లు చెడు ప్రవర్తనలకు అలవాటుపడి హైవేలపై ఎటుచూసినా కండోమ్స్ కనిపించేవన్నారు. ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు కండోమ్లు పెట్టి అసెంబ్లీని డెకరేట్ చేశా.. ఎందుకంటే ఎయిడ్స్ మీద ఎవేర్ నెస్ రావడానికి అని సీఎం చంద్రబాబు చెప్పారు.
గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో అస్తవ్యస్తం చేసి వెళ్లిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. తాను ఎన్నికల సమయంలో కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పానని, కరెంట్ చార్జీలు పెంచనని మరోసారి చెబుతున్నానని ఆయన అన్నారు. జనవరి పండగ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్డులో కూడా గుంతలు ఉండటానికి వీల్లేదని అధికారులకు ఆదేశాలిచ్చానని, గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో ఉన్నామని, వర్షాలు రావడంతో రోడ్లకు గుంతలు ఏర్పడ్డాయన్నారు.








