నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ ముఖ్య నేతలతో శుక్రవారం సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామన, పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారన్నారు. నామినేటెడ్ పదవుల కోసం ప్రస్తుతం 60వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
అందరికీ ఒకేసారి పదవులు ఇవ్వలేమని, విడతల వారీగా అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. రెండేళ్ల పదవీకాలం ముగిశాక మిగిలినవారికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడూ అంతే హుందాగా వ్యవహరించాలని సూచించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలకు సూచించారు. గంగాధర నెల్లూరు సభలో ”వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలోనూ రాకూడదు.. అలా చేస్తే పాముకు పాలుపోసినట్లే”నని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకత రావడంతో వాటిని చంద్రబాబు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరిస్తోందంటూ టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా మంత్రులు బాధ్యత తీసుకోవాలని, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనలు చేపట్టాలని సూచించారు. మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకొని ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.