చిత్తూరు జిల్లా (Chittoor District) చంద్రగిరి నియోజకవర్గ (Chandragiri Assembly Constituency) కూటమి రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) పులివర్తి నానికి (Pulivarthi Nani) సొంత కూటమి భాగస్వామ్య పక్షాల నుంచే ఊహించని రీతిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్న ఒక జనసేన(Jana Sena) నాయకుడు బహిరంగంగా చెప్పు చూపించగా, నిన్న మరో జనసేన లీడర్ సెల్ఫీ వీడియో విడుదల చేసి ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. తాజాగా నేడు భారతీయ జనతా పార్టీ(BJP) నేతమేడసాని పురుషోత్తం నాయుడు (Medasani Purushottam Naidu) నేరుగా ప్రెస్మీట్ పెట్టి ఎమ్మెల్యే నానికి అవినీతి (Corruption) పరుడు, భూ బకాసురుడు, ప్రజల రక్తం పీల్చే రాక్షసుడు అంటూ బిరుదులు ఇవ్వడం సంచలనంగా మారింది.
ఎమ్మెల్యే పులివర్తి నాని ఏ పని చేయాలన్నా నానికి ముడుపులు చెల్లించాల్సిందేనని సొంత కూటమి నాయకుడు ఆరోపించడంతో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. “అవినీతి, అక్రమాల్లో మహ్మద్ ఘోరీ (Muhammad Ghori) కన్నా పులివర్తి నాని ఘోరంగా తయారయ్యారు. జాతీయ రహదారి విస్తరణ పనులు చేయడానికి నెలకు రూ.10 లక్షల చొప్పున నేనే స్వయంగా కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నానికి కమీషన్ ఏజెంట్గా వ్యవహరిస్తున్న తిరుపతి రూరల్ మండల టీడీపీ(TDP) అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డికి (Eswar Reddy) ఆ డబ్బు చెల్లిస్తూ వచ్చాను. ఇప్పటి వరకు అలా రూ.29 లక్షలు కట్టాను” అని మేడసాని సంచలన బాంబు పేల్చారు.
పులివర్తి నాని కేవలం అవినీతిపరుడే కాదు, ఒక భూ బకాసురుడని.. ప్రజలను పీడించే రాక్షసుడని మేడసాని తీవ్రమైన బిరుదులు ఇచ్చారు. చిత్తూరు నుంచి చంద్రగిరికి (Chandragiri) వచ్చిన ఒక బందిపోటు దొంగలా నాని వ్యవహరిస్తున్నారని, అధికారులను బందీలుగా చేసుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. “ఆయనకు బంధువునని చెప్పుకోవడానికి సైతం నేను సిగ్గుపడుతున్నాను” అని వ్యాఖ్యానించారు.
చంద్రగిరిలో అవినీతి పెరిగిపోయి, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని బీజేపీ(BJP) నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరాచకాలపై జిల్లా కలెక్టర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. నాని అరాచకత్వంపై నియోజకవర్గ యువత ఉద్యమించాలని, ఇలాగే వదిలేస్తే భవిష్యత్తు తరాలకు ఆయన ఒక శాపంగా మారుతారని హెచ్చరించారు. నాని అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టేందుకు ‘సేవ్ చంద్రగిరి’ (Save Chandragiri) ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే నాని అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన ED, CBI, లోకాయుక్తలకు ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే న్యాయం కోసం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిస్తానని మేడసాని పురుషోత్తం నాయుడు స్పష్టం చేశారు. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, సొంత కూటమి నేతలే ఎమ్మెల్యేపై ఈ స్థాయిలో అవినీతి, వసూళ్ల ఆరోపణలు చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.








