సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్ర‌భుత్వం సెన్సార్‌షిప్.. HRF తీవ్ర ఆగ్రహం!

సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్ర‌భుత్వం సెన్సార్‌షిప్.. HRF తీవ్ర ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవాలను పంచుకునే సోషల్ మీడియా అకౌంట్లు, విపక్షాల ప్రెస్ మీట్‌లపై పోలీసులు నిఘా పెట్టడం.. ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుందనుకునే పోస్టులను తొలగించాలంటూ నోటీసులు పంపడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాంతిభద్రతల విఘాతం, ‘మిస్‌లీడింగ్ కంటెంట్’ వంటి పెద్ద పెద్ద పదాలను వాడుతూ చంద్రబాబు ప్రభుత్వం న్యూట్రల్ ప్లాట్‌ఫామ్స్‌ను, సోష‌ల్ మీడియా యాక్టివిస్టులను బెదిరింపుల‌కు గురిచేస్తోంది.

ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన‌ వారి ప్రెస్‌మీట్ బైట్లు పోస్ట్ చేసినా, య‌ధార్థ ఘ‌ట‌న‌ల‌ను చూపించినా, అమ‌రావ‌తిలో క‌రెంట్ కోత‌లు, రైతుల నిర‌స‌న‌లు వంటి వీడియోలు విడుద‌ల చేసినా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వెంట‌నే రంగంలోకి దిగి వాటిని తొల‌గించాల‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసుల ద్వారా ఎక్స్ నుంచి నోటీసులు పంపిస్తోంది. వివిధ పోలీస్ స్టేష‌న్ల ద్వారా సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు లేఖ‌లు రాయించి వాటిని డిలీట్ చేయిస్తోంది. కాగా, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీరుపై న్యూట్రల్ ప్లాట్‌ఫామ్స్‌ను, సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదించిన గూగుల్-అదానీ నేతృత్వంలోని ‘హైపర్‌స్కేల్ డేటా సెంటర్’ ప్రాజెక్టులపై విమర్శలు గుప్పిస్తూ మానవ హక్కుల వేదిక (HRF) పెట్టిన రెండు పోస్టులపై ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ఆంక్షలు విధించడం కలకలం రేపుతోంది. భారత సమాచార సాంకేతిక చట్టం (IT Act, 2000) లోని సెక్షన్ 79(3)(b) కింద ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది.

ఈ సెన్సార్‌షిప్‌ను తీవ్రంగా ఖండిస్తూ మానవ హక్కుల వేదిక ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. తమ పోస్టుల్లో ఎలాంటి చట్టవిరుద్ధమైన సమాచారం లేదని, ప్రజాప్రయోజనార్థం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రశ్నించడం పౌరుల ప్రజాస్వామ్య హక్కని సంస్థ స్పష్టం చేసింది.

“మేము లేవనెత్తిన అంశాలు అడవులు, కొండలు, నీటి వనరులు, వన్యప్రాణుల ఆవాసాలు, ప్రజా వనరుల రక్షణకు సంబంధించినవి. ఇలాంటి విషయాలపై పారదర్శకతను కోరడం చట్టవిరుద్ధమైన చర్య ఎలా అవుతుంది? ఇది పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధమైన యాక్టివిటీ” అని HRF ప్రశ్నించింది.

కేవలం ఒకట్రెండు సంఘటనలు కావు
ఈ నిర్బంధం కేవలం ఒక సంస్థకే పరిమితం కాలేదని, డేటా సెంటర్ల పర్యావరణ ప్రభావాలపై గళమెత్తే ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారని HRF ఆరోపించింది. అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల కూటమి ‘ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ కలెక్టివ్’ (ERC) తయారు చేసిన రెండు నిమిషాల వీడియోను కూడా మెటా (ఇన్‌స్టా) ఇండియాలో బ్లాక్ చేసింది. ఆనందపురం మండలం తర్లువాడలోని గూగుల్ డేటా సెంటర్ వల్ల దళిత భూములు, స్థానిక వర్గాలపై పడుతున్న ప్రభావంపై ఆ వీడియో రూపొందింది. దీనితో పాటు గత కొన్ని రోజుల్లో అడవివరం-ముదసర్లోవ ప్రాజెక్టును విమర్శిస్తూ వివిధ అకౌంట్ల నుండి పోస్ట్ అయిన కనీసం 20 షార్ట్ వీడియోలను ఇన్స్టాగ్రామ్ నిలిపివేసింది.

మరోవైపు గుంటూరు అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎక్స్ వేదిక కూడా HRFకు నోటీసులు పంపింది. అయితే ఎక్స్ తన పారదర్శకత విధానం ప్రకారం యూజర్లకు సమాచారం అందించి, ప్రస్తుతానికి కంటెంట్‌ను తొలగించలేదు. కానీ ఫేస్‌బుక్ మాత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సదరు పోస్టులను నియంత్రించింది.

HRF డిమాండ్లు
ప్రభుత్వం ఇటువంటి సెన్సార్‌షిప్ చర్యలను పక్కనపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని HRF డిమాండ్ చేసింది. ఒకవేళ సోషల్ మీడియాలో ఉన్న సమాచారం తప్పయితే, ప్రభుత్వం సరైన పత్రాలను, వాస్తవాలను ప్రజల ముందు ఉంచి చర్చించాలి తప్ప, ఇలా విమర్శలను నొక్కేయడం వల్ల ఉపయోగం లేదని పేర్కొంది. తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పంద పత్రాలు (MoUs), నీరు-విద్యుత్ వినియోగ వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని, పారదర్శకతను పాటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సంస్థలు తాము తొలగించిన కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment