ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సరికొత్త ఎక్సైజ్ పాలసీకి తెరలేపారు. మద్యం అమ్మకాలు (Liquor Sales) భారీగా పెంచేందుకు తద్వారా ఆదాయం కూటగట్టుకునేందుకు ఇకపై ఏపీలోని ప్రముఖ బీచ్లలో “బీచ్ షాక్స్ (Beach Shacks)” అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. గోవా తరహాలోనే ఏపీలో కూడా పర్యాటకులు మద్యం సేవించేందుకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ (Excise Department) అధికారికంగా జీవో నంబర్ 362 (GO 362) విడుదల చేస్తూ విధివిధానాలను, మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ సరికొత్త పాలసీ కోసం ప్రభుత్వం ముందే ఒక ప్లాన్ సిద్ధం చేసింది. రాబోయే సెప్టెంబర్ 1 నుండి 2029 ఆగస్టు వరకు (దాదాపు మూడేళ్లకు పైగా) ఈ బీచ్ షాక్స్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) రాష్ట్రంలోని 12 తీరప్రాంత జిల్లాల్లో అనువైన ప్రదేశాలను గుర్తించింది.
బీచ్లలో మద్యం తాగించే విధానాన్ని ఒకేసారి కాకుండా మొదట ప్రయోగాత్మకంగా (Pilot Project) అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్(Suryalanka Beach), విశాఖపట్నం (Visakhapatnam) (వైజాగ్) బీచ్.. ఈ రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో తలా రెండు బీచ్ షాక్స్ను మొదట ప్రారంభించనున్నారు. ఇక్కడ పర్యాటకుల రద్దీ, స్పందన అంచనా వేసిన తర్వాత మిగిలిన 12 జిల్లాల్లోని బీచ్లకు దీనిని విస్తరిస్తారు.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పర్యాటక రంగ అభివృద్ధి కోణంలో సమర్థించుకుంటున్నా.. దీనిపై అప్పుడే రాజకీయంగా, సామాజికంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. బీచ్లలో మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం సంస్కృతికి విరుద్ధమని, ఇది మహిళల రక్షణకు తీవ్ర భద్రతా సవాళ్లు విసురుతుందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.









బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర