పొదుపు ‘సంక్షోభం’పై ఏపీ సర్కార్ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు

‘పొదుపు’పై ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌చార కార్య‌క్ర‌మాలు

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆదేశాల‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు, పాలనలో అనవసర ఖర్చులను తగ్గించేందుకు కూట‌మి ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా నిర్వహించిన కేబినెట్ భేటీలో పొదుపు చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సామాన్యుడిపై భారం పడకుండా, ప్రభుత్వ యంత్రాంగమే స్వచ్ఛందంగా ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘నా దేశం – నా బాధ్యత’ అనే పేరుతో ఒక భారీగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

విదేశీ పర్యటనలు బంద్!
ప్రభుత్వ ధనంతో ఇన్నాళ్లూ చేప‌ట్టిన విలాసవంతమైన విదేశీ పర్యటనలకు చెక్ పెడుతూ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలను పూర్తిగా రద్దు చేశారు. అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలకు అనుమతి ఉండదని ఓ వెసులుబాటును క‌ల్పించారు. జిల్లా పర్యటనల సమయంలోనూ భారీ కాన్వాయ్‌లు, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని (కాస్ట్ కటింగ్) మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వాహనాల సంఖ్యను, వాటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని చంద్ర‌బాబు ప్రభుత్వం నిర్ణయించింది.

వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’
పర్యావరణ హితంతో పాటు ఇంధన పొదుపు కోసం వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున మంత్రులు, అధికారులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను (సైకిల్ లేదా ప్రజా రవాణా) ఎంచుకోవాలని సూచించింది. ప్రభుత్వ నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకోవాలని కేబినెట్ భావిస్తోంది.

మెజారిటీ సమావేశాలను భౌతికంగా కాకుండా వర్చువల్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారానే నిర్వహించాలని ఆదేశించింది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు, సమయం ఆదా అవుతాయని భావిస్తోంది. కార్యాలయంలో భౌతికంగా ఉండాల్సిన అవసరం లేని ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు.

ఏసీ టెంపరేచర్ 27 డిగ్రీలకే..
ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ ఆదా కోసం వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అన్ని సర్కారీ ఆఫీసుల్లో ఏసీల టెంపరేచర్‌ను 24 నుంచి 27 డిగ్రీల మధ్యే నిర్వహించాలి. దీనివల్ల భారీగా విద్యుత్ బిల్లులు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలోనూ ఆడంబరాలకు పోకుండా, అత్యంత పొదుపుగా నిర్వహించాలని కేబినెట్ స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment