ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమివ్వడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే యూరియా, గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, ఇప్పుడు ఇంధన కొరతతో మరింత కష్టాల్లో పడుతున్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రైతులు, రవాణా రంగం, రోజువారీ కూలీలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ క్రాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కడప ఎంపీ Y. S. అవినాష్ రెడ్డి కేంద్రాన్ని కలసి ఇంధన, గ్యాస్ కొరతపై వివరాలు తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నిరాజ్ మిట్టల్ ను కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సుమారు 70 శాతం పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేకపోవడం వల్ల వ్యవసాయం, వ్యాపార రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హమని పేర్కొన్నారు.
ఇక పలువురు నేతలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వివిధ జిల్లాల్లో బంకులను సందర్శించి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. నారా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యమే ఈ సంక్షోభానికి కారణమని ఆరోపిస్తూ నిరసనలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించడంతో పాటు, డీజిల్ కొరత కారణంగా వ్యవసాయ పనులు కూడా నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని తక్షణమే పరిష్కరించాలని ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.








