ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ మీద కోపం ఉంటే మాతో పోరాడాలి కానీ, మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు పీకేసి, ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చవద్దని కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగాలు తీసేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను పెంచుతున్నారన్నారు. వలంటీర్లను పక్కన పెట్టి, వెల్త్ వర్కర్లను తొలగించారని, నిరుద్యోగ భృతి గాలికొదిలేశారన్నారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. “మా ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసింది. ఐదేళ్లలో 30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం మా పాలనలోనే సాధ్యమైంది” అని అంబటి రాంబాబు వివరించారు.
“చంద్రబాబు సంపద సృష్టించడం లేదు, దోచుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి లాభపడుతున్నారు” అంటూ అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని విస్మరించారన్నారు. రాజధాని పేరుతో రూ.31,000 కోట్ల అప్పులు తీసుకున్నారని చెప్పారు. అప్పులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. గతంలో స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్లను మళ్లీ బిగిస్తున్నాడని విమర్శించారు.