సిరియాలో (Syria) మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. రెండు నెలల శాంతి తర్వాత, పశ్చిమ తీర ప్రాంతమైన లటాకియా ప్రావిన్స్లో (Latakia Province) శుక్రవారం భద్రతా దళాలు, మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al-Assad) మద్దతుదారుల మధ్య భీకర ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 70 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (SOHR) తెలిపిన వివరాల ప్రకారం, జబ్లే పట్టణంలో జరిగిన ఈ హింసలో 35 మంది భద్రతా సిబ్బంది, 32 మంది అసద్ మద్దతుదారులు, ముగ్గురు పౌరులు మరణించారు. అసద్ మద్దతు గల మాజీ కమాండర్ సుహీల్ అల్-హసన్కు అనుచరులు, భద్రతా చెక్పోస్టులపై దాడులు ప్రారంభించడంతో ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి.
భద్రతా బలగాలకు వ్యతిరేకంగా ఆందోళనలు
లటాకియా, టార్టస్ నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి కొత్త ప్రభుత్వ సైన్యానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. భద్రతా బలగాలను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ, దేశంలో శాంతిని కోరుతూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అసద్ పదవి నుంచి తొలగించబడిన తర్వాత ఇదే అత్యంత హింసాత్మక ఘటనగా భావిస్తున్నారు.