కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP) ముసుగులో హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలను తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. హిందీని అనుసరించడం వల్ల ఉత్తర భారత మాతృభాషలు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హిందీని అనుసరించాల్సిన పరిస్థితి వస్తే భాషా యుద్ధం తప్పదని ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు. “కేంద్రం హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ల్లో హిందీని రుద్దిన కారణంగా అక్కడి స్థానిక భాషలు తుడిచిపెట్టుకుపోయాయి. తమిళనాడులో అలాంటి పరిస్థితిని మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించం” అని స్పష్టం చేశారు.
“డీఎంకే ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడదు. డీలిమిటేషన్, జాతీయ విద్యా విధానం (NEP), త్రిభాషా విధానాలను మేము అంగీకరించం. తమిళనాడు సంస్కృతి, భాష, విద్యా విధానాన్ని కాపాడుకునే విషయంలో రాజీ ఉండదు” అని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు.