ప్రభుత్వ సంక్షేమ పాఠశాల హాస్టల్లో పదో తరగతి విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చర్చనీయాంశమైంది. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో చోటుచేసుకుంది. బోర్డు పరీక్షలు ముగించిన తర్వాత హాస్టల్కు తిరిగి వచ్చిన విద్యార్థిని సోమవారం ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
ఈ ఘటనపై ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాలికల హాస్టల్లో పురుషులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు. అయితే, బాలిక గర్భవతిగా ఉండడం ఎవరికీ తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హాస్టల్లో హెల్త్ వర్కర్ల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని వారు పేర్కొన్నారు.
విచారణ వేగవంతం
ప్రసవం అనంతరం బాలిక, శిశువును చిత్రకొండ సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే గర్భం కనిపించకపోవడంపై బాలిక తల్లిదండ్రులు పాఠశాల అధికారులను నిలదీశారు. బాలిక సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు గర్భవతిగా అయి ఉండొచ్చని జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస ఆచార్య వెల్లడించారు. ఈ ఘటనపై శాఖపరమైన విచారణ జరుగుతోంది. బాలికను గర్భవతిని చేశాడని అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.