ఓటీటీ (OTT) ప్లాట్ఫామ్లు నైతిక విలువలను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021 ఐటీ రూల్స్ (Code of Ethics) ప్రకారం.. ఓటీటీలు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, చిన్నారులకు ‘ఏ’ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు గురువారం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్పై ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించకుండా కంటెంట్ ప్రసారం చేయాలని స్పష్టం చేసింది. వయస్సు ఆధారిత నియంత్రణను పాటిస్తూ, ఓటీటీలు స్వీయ నియంత్రణ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ కార్యక్రమంలో రణ్ వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ అంశంపై పార్లమెంట్లోనూ చర్చ జరిగింది. అంతేకాదు, ఓటీటీ కంటెంట్ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది.