తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఎట్టకేలకు తన ఫాంహౌస్ జీవితం నుంచి బయటకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ వ్యవహారాలను దూరం నుంచి పర్యవేక్షిస్తున్న ఆయన, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు సన్నద్ధమవుతున్నారు.
పార్టీ భవిష్యత్తుపై కీలక సమావేశం
ఈ క్రమంలో ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో దీనికి సంబంధించి కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు తదితర కీలక నాయకులు పాల్గొననున్నారు. ముఖ్యంగా, బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎండగడతారా?
ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను, పాలనా వైఫల్యాలను ఎండగట్టే వ్యూహం రూపొందించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా, ప్రజల్లో పార్టీ పట్టును మరింత పెంచుకునేలా కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు.
ఈ సమావేశం ద్వారా కేసీఆర్ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి ప్రవేశించనున్నారని, బీఆర్ఎస్ భవిష్యత్తు దిశ, దశపై స్పష్టత రానుందని బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ఈ సమావేశం తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.