వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష వైసీపీ నేతలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసులో విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్కు వెళ్లి గురువారం ఉదయం గచ్చిబౌలిలోని వంశీ ఇంటికి చేరుకుని అరెస్టు చేశారు. ఈ అరెస్టు నాటకీయ పరిణామాల మధ్య జరిగినట్లుగా తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే వంశీపై బీఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం నమోదు చేసినట్లుగా వంశీ భార్యకు పోలీసులు అందజేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అరెస్టు అనంతరం పోలీసులు వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.








