తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Elections) దగ్గర పడుతున్న వేళ తమిళగ వెట్రీ కజగం (TVK) పార్టీ అధినేత దళపతి విజయ్ (Vijay TVK) వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన విజయ్.. పార్టీ పరమైన పదవుల కేటాయింపులోనూ అన్నివర్గాలకు స్థానం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor)తో విజయ్ త్వరలో భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల వ్యూహాల గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరువురు కలిసి పని చేసే అంశంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తమిళ రాజకీయ వర్గాల్లో (Tamil Nadu Politics) చర్చ నడుస్తోంది. అంతేకాక, తమిళనాడు వ్యాప్తంగా విజయ్ బస్సు యాత్ర లేదా పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారని, దీనికి ప్రశాంత్ కిషోర్ మార్గనిర్దేశం చేస్తారని సమాచారం. ఈ భేటీ రాజకీయంగా కీలక మార్పులకు దారి తీసేలా ఉంటుందా? తమిళనాడు ఎన్నికల్లో కొత్త పొత్తుల నాంది కానుందా? త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.