‘ఉచిత ఇసుక
, పారదర్శకంగా ఇసుక సరఫరా
, ఇక అందుబాటులో ఇసుక'
.. ఇలా ఎన్ని పేర్లతో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో మాత్రం శూన్యం. రాష్ట్రంలో ఇసుక దందా విచ్చిలవిడిగా కొనసాగుతోంది. అధికార పార్టీ అండదండలతో నేతలు యధేశ్చగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారని ప్రజల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక మాఫియాపై యువకుల సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. తూర్పుగోదావరి జిల్లా వంగలపూడి ఇసుక ర్యాంపు-2లో టన్ను ఇసుకకు రూ.250 వసూలు చేస్తున్నారని యువకులు ఆధారాలతో సహా వివరించారు. నిబంధనల ప్రకారం టన్నుకు రూ.84 ఉండగా, వంగలపూడి ర్యాంపు-2 నిర్వాహకులు రూ.250 వసూలు చేస్తున్నారని చెప్పారు. నిర్ణత ధర కంటే టన్నుపై రూ.166 అదనం. ’24 టన్నుల ఇసుకకు రూ.6 వేలు వసూలు చేశారు. బిల్లు, రశీదు అన్నీ తమ దగ్గర ఉన్నాయి. మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారూ’.. అని వేడుకుంటూ యువకులు ఇసుక ర్యాంపు వద్దనే సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు.
రాష్ట్రంలో ఇసుక దోపిడీకి యువకుల వీడియో అద్దం పడుతోంది. అదనంగా ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును అధికార పార్టీ నేతలు వాటాలుగా పంచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.